11, జులై 2010, ఆదివారం

కుక్క కట్టేసి ఉంటుందంటారా!!!

అంటూ మెట్లు దిగుతున్న శివ ప్రసాద్  ఒక్కసారి కొయ్యబారిపోయాడు.  ముందు నడుస్తున్న రాధాకృష్ణ, వెనక మెట్ల మలుపు తిరుగుతున్నా నాదీ  అదే పరిస్థితి. ఎదురుగా సింహం లాంటి అల్సేషియన్ వరండా లోంచి బయటకు వస్తూ మమ్మల్ని చూసేసింది.


తెలుగుతనానికి దూరంగా ఉద్యోగరీత్యా ఉత్తర భారత ప్రదేశ్ లో హిందీ బతుకు బతుకుతున్న మాకు అపుడపుడూ కలిసి కాలక్షేపం చేయటం ఒక సరదా.  రాధాకృష్ణ కు బదిలీ అవటం తో వాళ్ళని కలవటానికి  వచ్చి  కబుర్లలో పడి రాత్రి 11 గంటలు అవటం గమనించలేదు.  ఆ సమయానికి ఇంటివాళ్ళు సదరు సింహాన్ని కట్టేయకుండా వదిలేస్తారని కూడా మర్చిపోయం.


ముందు రాధాకృష్ణ ఉండటం మా అదృష్టమయింది.  మెడ మీద వాటా లోకి అద్దెకు ఉంటున్న ఆయన్ని కొద్దిగా గుర్తు పట్టి, నాలుకతో పరామర్శించే ప్రయత్నంలో పడింది. శివప్రసాద్ ఏమనుకుంటున్నాడో గాని, నాకు కాళ్ళు వణుకుతున్నాయి.  ఎక్కడైనా ష్.... మంటే పారిపోయే గ్రామా సింహాలు, వెనక వస్తుంటేనే భయపడి, మాటిమాటికీ వెనక్కు చూసే నాకు ఈ పరిస్థితి 'సింహ' స్వప్నమే .  పైన మెట్ల తలుపులు బిడాయించి భానుగారు, వాణి  గారు, మాయావిడ భయం గా చూస్తున్నారు. గభాల్న పైకి ఉడాయించుదా మన్న ఆలోచన వచ్చినా ' అది ఎపుడైనా వేగంగా వస్తుంటే కరిచేస్తున్దేమూ అనిపిస్తుంది' అని వాణి గారన్న మాటలు గుర్తొచ్చి ఆలోచన అదిమి కదలకుండా నిల్చుండిపోయాను.  మధ్యలో ఉన్న శివ పరిస్థితి బేరీజు వేసుకుంటూ హుస్సైన్సాగర్ బుద్ధ విగ్రహం లా నిశ్చలంగా నిలబడి ఉన్నాడు.  పరామర్శలు అందుకుంటున్న రాధాకృష్ణ కూడా భయపడుతుండటం స్పష్టం గా కనపడుతోంది.  విశాలంగా ఉన్న వరండా లోంచి ఇంటాయనను   పిలుద్దామన్నా వాళ్లకి వినిపించేలా  లేదు.  ఎవరికీ ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు.  మా భయాల్లో మేముండగా, సింహం పరామర్శ లాపి , మా వంక అనుమానంగా చూసి, ఠీవిగా రెండు మెట్లెక్కింది. శివ ఇంకా రెండు మెట్ల దూరంలోనే ఉండటంతో, భాను గారిలో గాభరా మొదలయ్యింది.  రాధాకృష్ణ రెండడుగులు ముందుకు వేసే ప్రయత్నం గమనించి, మొదట్లో ఆయనపై ఉన్న అభిప్రాయం చెరిపేసుకుని, వెనక్కి తగ్గి ఆయన్ను చేరి అనుమానించటం మొదలెట్టింది సింహం.  కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు శివ. నిమరాలని ఎత్తిన చెయ్యి నాకుతుంటే, లోపల భయంగా ఉన్నా, చిన్నప్పట్నుంచీ దాన్ని తన గుండెల మీద పెంచిన రకం ఆనందాన్ని ముఖంలో చూపిస్తూ, ఓ వెర్రి నవ్వు నవ్వి, దానికి అనుమానం పెరగకుండా, ముఖద్వారం వైపు జరగసాగాడు రాధాకృష్ణ.


దొరికిన అవకాశం చేజార్చుకోవద్దన్న గిరీశాన్ని గుర్తు తెచ్చుకుని, వెంటనే వాడేసుకున్నాను. చప్పుడు కాకుండా చప్పున పైకొచ్చిపడి మళ్ళీ తలుపులు బిగించాను.  ఆ సందడికో, రాధాకృష్ణ ఆనందానికి తృప్తి చెందో  ఏమో, ఆయన్ను విడిచి మళ్ళీ శివ దగ్గరకు వచ్చి నాలిక చాచింది సింహం.  అంతా నిశ్శబ్దం గా ఉంది. వీధి దీపం కాంతి  సన్నగా శివ ముఖంపై అయన భయాన్ని ప్రతిఫలిమ్పచేస్తోంది.  "ఏమండీ..." అంటూ భయంగా చెయ్యి ఎత్తి నాకోసం వెనక తడిమాడు.  "ఆ ఎత్తిన చెయ్యి మెల్లగా దాని వీపుపై వేసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చెయ్యండి"  నా గొంతు దూరంగా మేడ  మీంచి విన్పించటం తో, నేను చేసిన మిత్ర ద్రోహానికి గతుక్కుమన్నాడు.  వెంటనే ఆత్మరక్షణ ఉపాయం ఆలోచిస్తూ, "పాన్డేజీ..." అంటూ ఇంటాయాన్ని స్మరించాడు. మొదట్లో నూతినుంచి వచ్చినట్లున్నా అయన అరుపులు మెల్లగా స్టీరియో పానిక్ రూపాన్ని పొందాయి.


ఈలోగా ఈ హడావిడికి, రాధాకృష్ణ పిలుపులకి ఇంటాయన కరుణించి వచ్చి, దాని గొలుసు పట్టుకుని దూరంగా తీసుకుపోయే ప్రయత్నం లో పడ్డాడు. ఆడాల్లిద్దరూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా పడుకుని ఈ హడావిడికి  లేచి, ఇదంతా వినోదంగా చూస్తున్న శివ వాళ్ళబ్బాయి కౌశిక్ "భలే మజా వచ్చింది" అని గొల్లుమన్నాడు.

తెరిపినపడ్డ ప్రాణాలతో మేమంతా ఏడవలేక ఆ నవ్వులతో శృతి కలిపాం.


..... ఒక 5 సంవత్సరాల క్రితం మేము గొండా అనే తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు జరిగిన సరదా సంఘటన ఇది. మేమంతా మళ్ళీ కలుసుకున్న ప్రతీసారీ గుర్తు చేసుకుని నవ్వుకుంటాము. ఆ సంఘటనకి యధా రూపమే ఇది,  మీకోసం సరదాగా........................ చదివి ఆనందించారు కదూ !!!
మీ
మల్లాది లక్ష్మణ కుమార్.

7, జులై 2010, బుధవారం

సంగీతం పరమౌషధం!!!

ఈ మధ్య మా టీవీ లో వచ్చే సంగీత సంబరాలు చూస్తున్నారా! క్రితం వారం జరిగిన పోటీలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడేసారు. విష్యం ఏమిటంటే, దానిలో  ఒక  గాయని  పడిన  రాగం లోని  పాట.



 "రాగం" అని మన తెలుగులో వచ్చిన చిత్రం(చలన) ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. "తాయే యశోద" పాట ఎంతమంది విన్నారు? పోనీ ఇప్పుడైనా చేతులు ఎత్తండి!!



సంగీతం మానవ జాతికి యెంత అవసరమో, "శిశుర్వేత్తి  పశుర్వేత్తి ..." అని ఎందుకన్నారో, అన్ని బాధలు, అలజడులు సంగీతం తో ఎలా నయమవుతాయో, అసలు సంగీతం తో వైద్యం చెయ్యగలరా............       ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఈ పాట. (మహా మహా గొప్ప విద్వాంసులు/పాటలు మనకి చాలా వున్నాయి. ఏదో ఈ పాట గురించి అనుకుంటున్నాం కదా అని ఈ వ్యాఖ్య, గమనించగలరు).  ఆలాపన  తో మొదలైన  పాట గాయని  గొంతుతో  పాటు  రాగాలు  తీసే  వాయులీనం, పాశ్చాత్య  రాగాల /వాద్యాల  మిశ్రమం (fusion) మననీ  ఏదో  లోకాలలోకి  తీసుకుపోయి , విహరిమ్పచేసి అలరిస్తుంది.



ఒకప్పుడు "పాడుతా తీయగా" అన్న బాలు గారి కార్యక్రమం కోసం  మధ్య మధ్య లో  అయన చెప్పే  పాటల తెర వెనుక కధలు గురించి,  ఆ పాటల గురించి అయన వ్యాఖ్యానం, అయన చెప్పే తేట తెలుగు పద్యాల గురించి...... ఇలా చాలా వాటి గురించి చకోర పక్షుల్లాగా ఎదురు చూసే వాళ్ళం.  తెలుగు పాట ఎన్ని రకాలు గా పురుడు పోసుకుందో, ఎన్ని వయ్యారాలు పోయిందో, ఎన్ని రంగుల కళలు కందో, గాయకులు ఆ కార్యక్రమం లో పాడే పాత.. ఆపాత మధురాలు విని పులకించిపోయే వాళ్ళం. ప్రస్తుతం బహుళ ప్రచారం కోసం ఈ మధ్య వచ్చే సంకర పాటలు (పాతకులు/పాటకులు/పాఠకులు క్షమించాలి! లెస్స పలికితివి వత్సా! అని అనే వాళ్ళుంటే  ... ధన్యవాదాలు) అంటే అనీ కాదు, ఈ రోజుల్లో కూడా మంచి పాటలు వస్తున్నై. కాదని అనడంల్లేదు, కానీ ప్రేక్షకుల మనోరంజనం  కోసం చేసే చోట మంచి పాటలు పాడాలి. ఒక రోజు పాల్గొన్న గాయకుడు కూడా ఈ రకమైన బాధ వెలిబుచ్చారు. అయన ఒక మంచి పాత పాట పాడగా, న్యాయ నిర్ణేత అడిగారు, అందరూ ప్రస్తుత కాలం పాటలు పాడగా నువ్వు ఇలా చేసావేమిటి అని. దాని కోసం టీవీ వారిని ప్రాధేయపడి పాడాను అని చెప్పాడు కూడా.
ఇన్ని ఇలా జరుగుతుండగా, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుడు శ్రీ కీరవాణి (పేరులో తెలుగుతనం చూసారా) తనకు నచ్చిన పాటలు పాడితేనే వస్తాను అని షరతు తో వచ్చానని చెప్పారు. ఇంతకీ ఆ పాటలు ఏమిటో తెలుసా.. అలనాటి మల్లేశ్వరి లోని 'ఎందుకే నీకింత తొందర ..' , మరొక ఎప్పుడు వినని ఆణిముత్యం లాంటి పాట, ఆయనకి మన పాత మూలాలు మీద పట్టు వుండటం తోనే, తన పాటలు అంత శ్రావ్యం గా ఉంటాయి. కులుకుల కీరవాణి అని నేను సేకరించి పదిలపరచిన అయన పాటల గుచ్చానికి పేరు పెట్టుకున్నాను.



మరి ఏవీ ఆ పాత మధురాలు. ఏవీ ఆ మధుర మధురోహల సొబగులు. వింత దరువుల, వింత గొంతుకల, వింత విన్యాసాల పాటలు ఈ గాయకులూ పాడటం, వహ సెహబాస్ అని ఇతరులు పొగడటం, ఆకాశానికి ఎత్తే యటం .. నాకు మాత్రం నచ్చలేదు. మీరు ఎమనుకోపోతే ఈ మధ్య వచ్చిన రెహమాన్ రేహమేనియా కూడా అంత వినసోమ్పోగా లేదు. (మణిరత్నం మాయాజాలం మరుగైనట్లుగా..)



దయచేసి మన పురాతన నిధి ని పదిలంగా ఉంచండి, పదిమందికీ వినిపిమ్పచేయండి, ఆహ్లాదం కలిగించేలా అనుభవించండి, ఆ అనుభూతిని రోజంతా పదిలపరుచుకోండి.



మీ
మల్లాది లక్ష్మణ కుమార్