26, జనవరి 2011, బుధవారం

ప్రసాదం భక్తులు

మనం గుడికి వెళ్ళిన  ప్రతీసారీ ప్రసాదం దగ్గర కొచ్చేసరికి కొంతమంది ఏదైనా తీసుకుంటారు. కొంతమంది శుభ్రత, రుచి, ప్రసాదం లో రకం (పులిహోర, దధ్యోజనం, పొంగలి లాంటివి) చూసి తీసుకుంటారు.  కొన్ని చోట్ల ఏ రకమైన ప్రసాదం అయినా దాని రుచే రుచి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లాంటివి అన్నమాట. తిరుపతి లడ్డు "ఆహా మహా ప్రసాదం, ఏమి రుచి" అనుకుంటూ దేముడంటే పడని వాళ్ళు కూడా లాక్కుని, తింటారు. ఈ రోజుల్లో కొంచెం సహజ లక్షణాలు తగ్గినా, ఒక తునక అయినా చాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఒకసారి తిరుపతి వెళ్ళినపుడు, మా తాతయ్య వరసయే ఒకాయన అక్కడ పని చేస్తూన్దేవాళ్ళు.  అప్పట్లో ఇప్పుడు ఉన్నట్లుగా దర్శనం పైన అవరోధాలేమీ లేవు. దేవుని దగ్గర కొంతసేపు అలా నిన్చున్దబెట్టారు. ఇక ప్రసాదమైతే, ఒక పెద్ద బుట్టలో చక్కర పొంగలి, దోశలు, వడలు లాంటివి అనేకం తెచ్చి ఇచ్చారు.  ఈ ప్రసాదం రుచికరమైన ప్రసాదం ఎక్కడ దొరుకుతుందా అని చూసే వాళ్ళని "ప్రసాదం భక్తులు" అని నామకరణం చేశాను. వీళ్ళు గుడికి దాదాపు ప్రసాదం  కోసమే, (కొంచెం భక్తి తో కూడా) వెళ్తారు.

ఇదంతా ఎందుకు చెప్పోచ్చానంటే, నేను కూడా ఆ ప్రసాదం భక్తులలో ఒకణ్ణి.  చిన్నప్పుడు బందరు లో కృష్ణా రావు గారి బళ్ళో చదివేప్పుడు (బందరు బచ్చుపేట లో వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉండేది.) పుష్య మాసం (ధనుర్మాస) లో రోజుకొక్క తరగతి నుంచి ప్రసాద వినిమయం కోసం పిలిచేవారు. మా వరుస ఎప్పుడొస్తుందని ఆత్రం గా చూసే వాణ్ని. ప్రసాద మంటేనే కొద్దిగా పెడతారు. అందుకే దానికి ఆ రుచి వస్తుందేమో. అయినా, వరుసలో ఒక ఆకు (మర్రి అకో మరి ఏదో  గుర్తు లేదు) పుచ్చుకుని వేడి వేడి తీపి పొంగలి నోరు కాల్చుకుంటూ తినటం నాకింకా గుర్తే. అక్కడ కళ్యాణ మంటపానికి పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి. చెప్పాలంటే అంత పెద్దవి కాదు కానీ అప్పటి నా వయసుతో పోల్చుకుంటే పెద్దగా అనిపించేవి. ఎక్కటానికి కష్ట పడే వాళ్ళం. వాటిమీదేక్కి ఆడుకోవటం ఇంకొక మంచి జ్ఞాపకం.  విషయం మారి నా పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతున్నాను...

ఆ తరువాత నేను పెద్దయ్యాక గుడికి వెళ్ళినపుడు, ప్రసాదం పుచ్చుకోవటం అనేది చాలా అరుదుగా జరిగింది. అక్కడి శుభ్రతా, పెట్టే వాడి శుభ్రతా అన్నీ చూసి తిన బుద్దయ్యేది కాదు.  ఆ మధ్య ఒక గుడిలో (బ్రాహ్మల నిర్వహణ లోని గుడి) మా బావమరిది తో వెళ్ళినపుడు 'గారి' ప్రసాదం పెట్టబోతే ఆ ఇచ్చే అయన మా వాణ్ని 'ఏమండీ ఆయన బ్రాహ్మలు కాదా' అని అడిగాడుట.

కానీ ఈ మధ్య ఈ చెన్న పట్నం లో నంగనల్లురు లోని శ్రీ ఆంజనేయ స్వామి గుడిని ఒక స్నేహితుడు పరిచయం చేసాడు. (ఆయనను 'భక్తుడు' అన్న పొట్టి పేరు పెట్టేసాను.ఈ భక్తుడు కూడా ప్రసాదం భక్తుడే) అక్కడ ప్రసాదం గురించి ప్రత్యేకం గా చెప్పాలి. పొంగలి గానీ పులిహోర గానీ, రవ్వ కేసరి, తీపి పొంగలి కానీ ...  ఆహా యెంత రుచి గా ఉంటుందండీ. మంచి నెయ్యి కారిపోతూ యమ రుచిగా వుంటుంది. ఏ మాట కా మాటే చెప్పుకోవాలి, నా శుభ్రతా పరీక్ష లో కూడా అది నెగ్గింది. చాలా శుచిగా, మడిగా తయారు చేస్తారు. చెన్నై లో నేను చూసిన దేవాలయాలన్నిటి లోనూ ప్రసాదం చాలా రుచిగా వుంటుంది. అన్నిటిలోకీ ఈ గుడి ఇహ చెప్పకర్లేదు.

అందుకని ఈ మధ్య నేను మళ్ళీ ప్రసాదం భక్తుడ నయిపోయి, దాని కోసమే గుడికి వెళ్లి ఒక చుట్టు తిరిగి, దేముడికి ఒక నమస్కారం పారేసి (భక్తి తోనే అనుకోండి) ప్రసాదం వరుసలో నిలబడి పోతున్నాను. ఒకోసారి, రెండవ సారి కూడా. (ప్రసాదాన్ని బట్టి)

మీరుకూడా, దేముడేవరైనదీ కాకుండా భక్తి తో ప్రసాదం భక్తులుగా మారిపోండి.

ఉంటాను

మీ
మల్లాది లక్ష్మణ కుమార్.

22, జనవరి 2011, శనివారం

ఉద్యోగ పర్వం లొ కిష్కింధ కాండ!!

మా గొండా జీవితం లొ మరొక మరిచిపొలేని జ్ఞాపకం ఇది. చలి కాలం లొ సరదాగా ఉదయాన్నె లెచి మిత్రులు శివ ప్రసాదు, రమెష్ లతొ ఉదయం నడకకి వెళ్ళే వాళ్ళం. అలా ఊరి బయటి దాకా వెల్లి ఒక ఘంట సేపు తిరిగొచ్చె వాళ్ళం. ఉదయన్నె కటిక మంచు (కటిక చీకటి  లాగా,  అంటే దట్టమైనది అని అనుకొండి ) లొ ప్రకృతిని చూస్తూ అస్వాదిస్తూ చల్లదనాన్ని గొంతు నిండా  నింపు కుంటూ , (తరువాత జలుబు వలన నానా ఇక్కట్లు వచ్చెవనుకొండి) కబుర్లు చెప్పుకుంటూ వెడితే యెం మజా గా ఉందెదొ...

ఒక రొజు మంచు తెరల మాటున మన శివుడు ఒక అద్భుతాన్ని చూసాడు: యెమిటంటారా...

ఒక తొట... మన అంధ్రులకు ఎంతగానొ ప్రియమైన శాకం, మాయాబజార్ లొ కూడ "శాకంబరీ  దేవి వర ప్రసాదం,ఆంధ్రుల వంట.. అది లేకుండా ప్రభువులు ముద్దైనా ముట్టరు" అని అనిపించుకున్న మన గొంగూర.

అక్కడ వున్న రొజుల్లొ రమారమి సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మన అంధ్రా కేసి వచ్చె వాళ్ళం. ఇష్టం అని పచ్చళ్ళు యెంత పట్టికెల్లినా రెండు నెలల లొపే తాజా దనం పొయి అరుచి కలిగెది. తాజా గా చేసుకుందాం అంటె దొరకని స్థితి. ములక్కాడలూ అంతే, అస్సలు దొరికెవి కాదు. ఒక రొజు బజారులొ కనిపించాయి అంటె ఇహ మనవాళ్ళందరికీ చెప్పి తొలుకెళ్ళెవాళ్ళం. అవీ చాలా లేతగా 5 లెక 6 అంగుళాల  సైజులొ దొరికేవి.

ఈ తాయిలం కనిపెట్టిన శివ ప్రసాదు, వాళ్ళావిడ  తొ చెప్పేసాడు , మేము  ఒక ఖజానా ని చూసామని. ఇంకెముంది, జనాలంతా పెళ్ళాలని, వచ్చిన వాళ్ళు పిల్లలని వెంటేసుకుని ఒక ఉదయం ఆ గొంగూర చెను మీద పడ్డాము. కల్లు తాగిన కొతి వనమంతా చెరిచిందనీ... వానరులు కిష్కింధ వనం అంతా నేల మట్టం చెసినట్టుగా.. అసలె వాళ్ళు నారు కొసం పెంచినట్టున్నారు, అవి గొంగూర వ్రుక్షాలయినాయి. ఆ వ్రుక్షాలన్నీ మోడు చెసి, విరక్కొట్టి, కొసుకున్న వాళ్ళు కొసుకున్నంత తెచ్చెసుకున్నారు. దాంతొ పులుసె పెట్టుకొ, పచ్చడె చెసుకొ, పప్పె వండుకొ, ఉన్నన్నళ్ళూ వారం పది రొజుల పాటూ గొంగూర సంతర్పణ చెసుకున్నాం.

నేనుకూడాఈ వానరుల్లొ ప్రముఖుడినే  అని చెప్పటానికి  మిక్కిలి సంతొషిస్తూ, ఎండ  మావుల్లొ నీటి  చెలమ లాగ మాకు ఆ వనాన్ని తెలియ కుండా అంకితం చెసిన అజ్నాతుడికి ధన్యవాదాలు చెపుతూ...

ఇంకొ విషయమండోయి , ఈ కొతి పనికి అలవాటు పడి  కొన్ని రొజుల తరువాత వెల్లిన మాకు చుక్కెదురైంది. యెవరొ కాపలా మనిషి తిట్టినంత  పని చేయటం తొ అటుకేసి వెళ్ళటం మానుకున్నాం.

ఈ కిచ కిచలు మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలు వ్యాఖ్యలలొ తెలియ చేయండి.

మీ
మల్లాది లక్ష్మణ కుమార్




21, జనవరి 2011, శుక్రవారం

ఉద్యోగపర్వం లో హిందీ వేట

రామాయణం లో పిడకల వేట లాగ,నా ఉద్యోగ పర్వం లో హిందీ వేట బాగా జరిగింది. ఇవ్విధంబెట్లనిన:

నాకు హిందీ భాషా రానేరాదు నేను ఉద్యోగం లో చేరిన కొత్తలో.  మా బ్యాంకు ఉత్తర దేశం లో కేంద్రీక్రుతమయినందువలన శిక్షణ కోసం జబల్పూర్, భువనేశ్వర్, కలకత్తా, చండీగర్ ఇత్యాదులైన ప్రదేశాలకి వెళ్ల వలసి వచ్చేది. దూర ప్రయాణాలు చేయటం అలవాటు లేని పని. ఎలాగైతేనేం, మొదటిసారి జబల్పూర్ వెళ్ళే పని పడింది 15 రోజుల శిక్షణ కోసం. అర్ధరాత్రి గంగా కావేరి రైలు పట్టుకుని మొదటి తరగతి లోకి అడుగుపెట్టాను. నా కూపే ఏదో కనుక్కోవటం తెలియకపోవటం వలన మిగిలిన వారిని నిద్ర లేపి తిట్లు తినవలసి వచ్చింది. ఒక పెద్దాయన నా అవస్థ గమనించి, నాయనా, కొత్తా ఏమిటి అని, పెట్టె తలుపు మీద వున్న అక్షరాలను గమనించి నీ సీటు చూసుకో అని నన్ను వోదార్చాడు.

తెల్లారింది, నాగపూర్ చేరాము. లేచి దంతధావనం చేసుకునేసరికి, పక్క పెట్టె లోనుంచి  (పెట్టె అనగా, కూపే అని కవి హృదయం) చక్కని సంగీతం, తబలా వాదన సన్నగా వినిపిస్తోంది. ఏమిటా అని చూద్దును కదా, హిందుస్తానీ సంగీతం ఏరులై పారుతోంది.  ఒక తమిళ జంట, ముచ్చటగా ఉన్నారు, సంగీత ప్రేమికులనుకుంట! ఒక ఉత్తర దేశపు పెద్దాయన తబలా ముందేసుకుని కూర్చుంటే, వీళ్ళు కర్నాటకాన్ని, హిందుస్తానీ ని కలగలిపి సమయాన్ని గడుపుతున్నారు. కాసేపు వాళ్ళ దగ్గరే కాలక్షేపం చేసాను. అక్కడే ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, కున్నక్కుడి వైద్యనాధన్ ల "రంగులు" (colours) అనే కాసెట్ చూసాను. తరువాత కొని విని ఆనందించాను అనుకోండి. కాసేపు డైరీ (అప్పట్లో అదో వింత ప్రపంచం నాది) రాసి, వచ్చే పోయే స్టేషన్లు చూస్తూ కూర్చున్నాను. మొదటిసారి కావటం తో నాలో ఆత్రుత మొదలయింది, శిక్షణా కేంద్రానికి ఎలా వెళ్ళాలా అని, తోటి ప్రయాణీకుడిని అడిగితె, వెళ్లేసరికి రాత్రి 11 అవుతుందని , పైగా  ఆ  రోజు  హోలీ పండుగ, హడావిడిగా ఉంటుందని, తన వాహనం లో గమ్యస్థానం చేర్చాడు.

ఇక్కడ చూడండి చమత్కారం. అక్కడ వృత్తాకారం లో ఉన్న గదుల మధ్య భోజనాల బల్ల ఇతర సామాన్ లు ఉన్నాయ్. కొన్నిటి మీద "సౌచాలయ" అని రాసి ఉన్నది. మామూలుగా హిందీ లో 'సోచనా' అనగా ఆలోచించటం గదా అనుకుని అవి కార్యాలయ గదులేమో అనుకున్నాను. నాతొ పాటూ ఇద్దరు తెలుగు మేకలు (బకారాలన్నమాట) కూడా వచ్చారు. వారికీ హిందీ రాదు. ఉదయం లేచి కాలకృత్యాల కోసం వెతుకుతుంటే, అక్కడి పనివాడు నాకు ఈ 'సౌచాలయ' చూపించాడు. ఇవి తరగతి/కార్యాలయాల గదులు కదా బాబూ అంటే, నన్నొక వెర్రి చూపు చూసి, తలుపు తెరిచాడు. చూద్దును గదా పాయిఖానాలు. ఇహ చూసుకోండి! మిత్రులంతా ఈ విషయం చెప్పుకుని నేనక్కడ ఉన్నన్నాళ్ళూ ఏడిపిస్తూనే ఉన్నారు. 

ఎలా ఉన్నదంటే, వెనకటికో సహోద్యోగి, (హిందీ బాధితుడే) నాగపూరు వెళ్లి, రిక్షా మాట్లాడుకుని, వాడు మూడు వేళ్ళు చూపించి తీస్, తీస్ (చాలా సంవత్సరాల క్రితం లెండి, ఇప్పుడు ౩౦౦ అన్నట్టు) అంటే మనవాడు తీన్ ని గుర్తు తెచ్చుకుని, హుశారుగా ఎక్కేసాడు. తీరా వెళ్ళాక, విషయం అర్ధమై వాడితో హిందీ లో పోట్లాడలేక,   డబ్బులిచ్చి వదిలించుకుని, తిన్నగా నడుచుకుంటూ వెనక్కి వచ్చేసాడుట.

ఈ విష్యం ఇలా వుంటే, అక్కడ ఉన్నన్నాళ్ళూ  నా పని పోకచెక్క లా తయారయింది. వాళ్ళ భాష అర్ధం కాదు, తిరిగి చెప్దామంటే, చెప్పలేను. ఆ కార్యక్రమం ముగిసే సరికి, కొంత మటుకు హిందీ లో పండిట్ ని అయిపోయానంటే నమ్మండి. ఇక ఈ గొండా లోకి వచ్చి పడేసరికి, చాలా వరుకు వ్యవహారిక భాష పట్టుకోగలిగాను. కానీ ఇక్కడ ఇంకో చిక్కొచ్చి పడింది. ఈ భాష వేరొక యాస(భోజ్పురీ) లో వుండటం వలన, వాళ్ళు పూర్తిగా సత్తెకాలపు మనుషులవటం వలన, పాలబ్బాయి, కూరలబ్బి, పనివాళ్ళు ఏమి మాట్లాడిన ఉత్తినే వూ కొట్టి తలూపటం, అర్ధమైనట్లు నటించటం చెయ్యాల్సి వచ్చేది.  వాళ్ళెంత సత్తేకాలం వాళ్ళంటే, నాకు హిందీ రాదురా మొర్రో అంటే వీడేమిటి ఈ భారత దేశంలోనే పుట్టాడా అని వింతగా చూసేవాళ్ళు. మా మిత్రులంతా కలిసి వాళ్ళముందే సుభ్భరంగా తెలుగులో ఎల్లి మీద పిల్లి, పిల్లి మీద ఎల్లి అని చెప్పుకునేవాళ్ళం, వీళ్ళకు యెలాగూ  తెలియదుగా అని.

కొంత   మటుకూ ఇదీ విష్యం. మరికొంత మళ్ళీ గుర్తొచ్చినపుడు, వీలయినపుడు, సమయం చిక్కినపుడు...

ఉంటానండీ,
మీ
మల్లాది లక్ష్మణ కుమార్
   

20, జనవరి 2011, గురువారం

తవికలు - 2

ఇంతకు ముందు చెప్పినట్టు, మిత్రులు నండూరి శివ ప్రసాదు గారు, తన మరొక తవికను ప్రచురించటానికి అంద చేసారు!

ఇది చదివే ముందు కొంచెం ముందుమాట చెప్పాలి. మన కృష్ణా, గోదావరి లాంటి తీరాంధ్ర ప్రాంతాల్లో చలికాలం అన్నది పేరుకే అని, ఒక మాదిరిగా ఉత్తరాంధ్ర లో చలి పెడుతుందని, మనకి తెలుసు.( నీ చెప్పేది ఇక్కడ ఉంటున్న ఆంధ్రుల గురించి. విదేశాలలో అయితే మంచు కురియటాలు, ఆ బాధలు వేరే ఉంటాయి. నా పాఠకుల లో  రకరకాల దేశాల వారున్నారని ఈ మధ్య గూగుల్ వారు మొదలెట్టిన పాఠకుల జాబితా వలన తెలుస్తోంది. వారందరికీ నా ధన్యవాదాలు, నా సోదిని భరిస్తున్నందుకు. ఒక విన్నపం ఏమిటంటే... దయచేసి మీ సలహాలను, వ్యాఖ్యలను, అభిప్రాయాలను వ్యాఖ్య లతో తెలియచేయండి )

కానీ, నా లాంటి (మా లాంటి) కోస్తా జీవులకి, ఉత్తర భారత దేశ చలి ఈ గోండా లోని ఉద్యోగ పర్వం వలెనే తెలిసొచ్చింది. ఆ కాలం మొదలైన నుంచీ ప్రతీ వారం ఏదో ఒక కొత్త రకం దుస్తులు, ఆ చలి తట్టుకొవటానికి కొనవలసి వచ్చింది. అందువలన మీరు ఈ క్రింది ఉదాహరించిన స్తితి ని చూసి నవ్వుకోవద్దునని మనవి.

ఇంతకీ మన శివుడు చెప్పిన అనుభవాలు ఏమంటే :
(వారి రచన యధాతధం గా ఇవ్వటం వలన కొండొకచో ఆంగ్ల పదాలు అలాగే వుంచటం జరిగింది, క్షమించండి.)

ముత్యాల మంచు ముద్దాడగా
పచ్చ పచ్చని పైరు పరవశించింది
పట్టాల శ్వట్టర్స్ కప్పుకున్న పశువులు
పొగ మంచులొనుంచి పలకరిస్తున్నాయి

సూరీడుని సూసిని సూసి సాన రోజులయ్యింది
సుక్కల్ని సూసి సాన కాలమయ్యింది

వేశవి కాలపు తీవ్రత
వర్షకాలపు ఆర్ద్రత
శీతకాలపు సాంద్రత
ఇదే మా గోండా ప్రత్యేకత!!

A BEAUTIFUL WINTER

డార్జీలింగ్ లోనో హిమాలయాల లోనో ఉండే మంచుతో తెల్లవారింది. సూర్యుడు కనపడకుండా గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. చన్నీళ్ళలో చేతులు పెడితే చురుక్కుమంటొంది. వేడి వేడి అన్నం కూడా రెండు నిముషాలలో మాయం అయిపోతొంది. అన్ని రకాల వేషదారణలో Bike మీద బయలుదేరాను. winter shirts (అంటే పాత shirts) వాడటం మొదలు పెట్టాను. (బయటికి కనపడవు కదా) . ఐదు అడుగుల ముందు ఏ ముందో కనపడటం లేదు. పట్ట పగలు కూడ Head Light కాంతి అవసరం లేదంటే Accident తధ్యం .

గోండా నుంచి తరబ్ గంజ్ కి వెళ్ళే లోపు ఏడవకుండా ఏడుపు ( మంచు కను రెప్పల మీద పడి బిందు రూపంలో రావటం) వర్షంలోకి వెళ్ల  కుండా శిరస్త్రానము, బట్టలు తడిసి పోవటం, ముత్యాల మీసం(మంచుతొ తడిసిన) Bike Speed 20km దాటక పోవటం వల్ల మేఘాలమీద కీలుగుర్రం మీద వెడుతున్న అనుభూతులు  చాల కొత్తగా ఉన్నాయి.

                        *        *        *
దీనిలో నాకు నచ్చిన ఒక ప్రయోగం, " ముత్యాల మీసం"
మంచులో తిరగగా మంచు బిందువులు మీసం పై పడి మెరుస్తుంటే ముత్యాలతో చేసిన మీసం లా ఉన్నదని మిత్రులు సెలవిచ్చారు.  బాగుంది కదూ!!

మరిక సెలవు
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది





నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు

మా చక్రి సంక్రాంతి శుభవేళ కొత్త సందేశం ఇచ్చాడు. మరిక అదేమిటో చిత్తగించండి:
                                                        *       *      *
నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు
ఆనాటి కానాటి
సామ్రాజ్యాలు సామ్రాట్టులు మటుమాయమయ్యే
రాజ్యాలు రాజులు పోయి రాతి గురుతులు మిగిలే
నవాబులు పటేళ్ళు తెరమరుగాయే
కామందులు కరణాలు కనుమరుగాయె
ఘోర కలికల్మషములు కాలగర్భము చేరె !
నాటికి నేటికి తెలుగు వెలుగుజూడ
పాంచ వేద మది నన్నయ్య తెనిగించు
రామాయణమున్ తిక్కన నిర్వచించు
సిరికిన్ జెప్పడంటూ శ్రీనాధు వర్ణించు
మందార మకరందమనుచు పోతన ప్రార్ధించు
సత్య భామనే యనుచు సిద్దేంద్రు నర్తించు
శ్రీరాము దయ చేతననుచు బద్దెన పలికించు
విశ్వదాభిరామయన్చు వేమన బోధించు
అదివో అల్లదివో అనుచు అన్నమయ్య మ్రొక్కించు
లెస్స లెస్సయని శ్రీకృష్ణరాయ శ్లాఘించు
పలుకే బంగారమాయెనా యనుచు గోపన్న లాలించు
ఎందఱో మహానుభావులన్చు త్యాగయ్య కీర్తించు
ఎల్లలెరుగని నీ విదుల భావమ్ముల మేలుగని నీ
సంక్రాంతికిన్ విశాలాంధ్రసుతుల్ సుఖమునొందు గాక
వేర్పాట్లు మరచి !!

(--భావము తప్ప వ్యాకరణ దోషములు గ్రహించ వలదని మనవి ) అని చక్రి తెలియచేసారు.
                                       *     *     *

మన తెలుగు వెలుగులు ఎల్లెడలా వ్యాపింప చేయు ఇటువంటి కీర్తనలే మనకు రక్ష. కావున దయచేసి మన భాషను విడదీయకండి. కిన్చపరచకండి. అభిమానించండి. సొగసును ఆస్వాదించండి.

ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, యాస ఏదైనా... 

"జై తెలుగు" అనండి.  తెలుగు తల్లికి నివాళు లివ్వండి.

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది.
(మీ అభిప్రాయాలను ప్రచురించటం మరచిపోకండి)