12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ రామ నీ నామ మెంత రుచిరా !!!


కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూలా కర్తవ్యమ్ దైవమాన్హికం

శ్రీరామ రామ రామేతి , 
రమే రామే మనోరమే;

సహస్ర నామ తతుల్యం, 

రామ నామ వరాననే. 

'రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత, భక్తీ, అనుభూతి ఉన్నాయి. అందుకనే గామోసు అప్పటి హనుమాన్ నుంచీ భక్త శబరి, వాల్మీకి, త్యాగయ్య, రామదాసు మళ్ళీ తరువాతి కవిజనం ఆ భక్తీ భావం లో మమేకమై మనకి మంచి కృతులని, గీతాలని, పాటలనీ అందించారు. ఇక సీతారామ కల్యాణం జగత్ప్రసిద్ధం. భద్రాద్రి లో జరిగే ఈ వేడుక పండిత పామర జనరంజకం గా వైభవం గా జరుగుతుంది.

గంగా నది చూస్తె యెంత పవిత్ర భావం కలుగుతుందో, శివాలయం లో కార్తీకం లో డమరుక నాదాలతో విభూతి పరిమళాలతో శివలింగం చూస్తె (నా చిన్నప్పుడు బందరు లో ఖోజ్జిల్లుపేట శివాలయం లో కార్తీక మాసం ప్రతీ రోజూ రాత్రి వివిధ హారతులు ఇస్తూంటే, డోలు, ధమరుకాలతో నందీశ్వరుడు, శివుడు దిగివచ్చినట్టు గా వింత వింత నాదాలతో గర్భగుడి ప్రతిధ్వనిస్తూంటే ఒడలు పులకరించేవి) ఎంత వింత అనుభూతి కలుగుతుందో, శ్రీ రామ నవమి నాడు స్వయం గా చేయకపోయినా ఆ కళ్యాణ ఘట్టం తలుచుకుంటే అంత అనుభూతి. క్రితం సంవత్సరం ఈ రోజు (శ్రీ రామ నవమి నాడు) నేను రాసిన నా  జ్ఞాపకాల గురించి చదవాలనుకుంటే    ఇక్కడ      చూడండి.  
స్వామివారి వడపప్పు, పానకాలు జనులందరూ మెచ్చే ప్రసాదాలు.

జనన మరణ భయ శోక విదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం 
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
అటువంటి ఈ రామ ప్రసాద రసం, పానకాన్ని కరువుతీరా గ్రోలండి.

రామ భక్తీ సామ్రాజ్యం,
ఏ మానవుల కబ్బెనో మనసా.. అని త్యాగయ్య ప్రశ్నించు కున్నాడు.

అలాగే...

ఆ మానవుల సందర్శనం
అత్యంతా బ్రహ్మానందమే మనసా...

అని కూడా ఆనందపడ్డాడు.

ఆ ఆనందాన్ని తమ  ప్రతి చిత్రం/చలన చిత్రం లోను రామ భక్తి చూపించిన బాపు రమణలు ధన్యులు.  ఆ రాముని భజియించినట్టి భక్తాగ్రేసరు లందరూ ధన్యులు.


లోక కళ్యాణార్ధం ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుభ ముహూర్తాన జరుగే సీత రామ కల్యాణం ప్రజలందరికీ శుభకరం, మంగళ దాయకం. భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు ఇక్కడ మననం చేసుకుందాము:


శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు 
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో 
త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!


చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో 
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా 
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!


రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ  కల్పవల్లి కా 
రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో 
ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం
దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి!


మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ...




మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.


మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది 

9, ఏప్రిల్ 2011, శనివారం

అంకురం... ఒక హెచ్చరిక


ఎవరొ ఒకరు                       
ఎపుడో అపుడు
నడవరా ముందుగా            
అటొ ఇటొ ఎటోవైపు...


(అంకురం అన్న తెలుగు చలన చిత్రం లో నుంచి) 

ప్రజల కోసం... ప్రజా సమరం... ప్రజా విజయం

అవినీతిని అంతమొందించటానికి, భ్రష్తాచారాన్ని తుదముట్టించడానికి ఉద్యమించిన ఒక సామాన్యుడు ప్రజల మద్దతుతో, ఏ రాజకీయ కొణం లేకుండా, దేశమంతా వెల్లువెత్తిన ప్రజాభిమానం తొ సాధించిన తీరు ... అభినందనీయం.

ఇది ఒక అంకురం. ఆ చిగురుని ఆదిలొనే ఎండకట్టకుండా వ్రుక్షాన్ని చేయవలసిన బాధ్యత మేధావులు, యువత, ప్రజ, మనందరిమీదా ఉంది.

చిత్రమేమిటంటె, ఇన్ని సంవత్సరాల నించి ఆ బిల్లు అమోదం పొందకుండా చేసిన రాజకీయ పార్టీలు, నేతలు (ఇలా అని ఎందుకనాలంటె, పార్లమెంటులొ ఒటు వేసెది అమోదింపచేసేది వారే కాబట్టి), ఇపుడు టీవీ లొ చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తాయి, వారికసలు సిగ్గె లెదా అని అనిపిస్తుంది. ఒక ఎన్నికల పోటిదారుదంటాడు  .. "ఈ స్ఫూర్తి తొ అవతల పార్టీ వారు చేసే నొట్ల పంపకం, అవినీతి అడ్డుకుంటానని". మరి ఇప్పటిదాకా ఈయనెం చెసాడో. జనాలు నవ్వుతారని కూడా చూడకుండా , ఈ చైతన్యాన్ని కూడా ఒట్ల కోసరం వాడుకుందామని ఆయన యత్నం.

ఈ విజయ ప్రకటన వచ్చిన సమయం లొ ఒక టీవీ చర్చా కార్యక్రమం లొ పాల్గొన్ననేత ఒకామె(టైంస్ నౌ చానెల్ లొ, పేరు మీనాక్షి రెడ్డి) ముఖం లొ భావమేమీ లేకుండా పెడసరం గా విసిరిన మాటలు పాల్గొనే వాళ్ళనే కాక చూసె వాళ్ళకు కూడా విసుకు, కోపం తెప్పించాయి. ఇక మన రెణుకా చౌదరి అయితె, ఇదేదో రాజకీయ పార్టీల, నేతల పైనే జరుగుతున్న పొరాటంలా వర్ణించి తన అసహనాన్ని వ్యక్తం చేసారు. అవినీతి బురద అంటించుకున్న ఈ ప్రభుత్వం లోని రాజాలు, కల్మాదీలు, ఆదర్ష్ కాలనీలు ఇలా...  ఇవన్నీ ఈ రాజకీయ కొణం లొని భాగాలే.

ఇకపొతే, చేసేదేమీ లేక, కేవలం మూడు రొజుల్లొనే విజయవంతం గా ముగిసిన ఈ రాజకీయేతర విప్లవానికి తల వంచలేక, వంచలేక వంచిన కాంగ్రేస్, ఇది ప్రభుత్వం దిగివచ్చినట్లు కాదనీ ప్రజాస్వామ్య విజయం అనీ రక రకాలుగా ప్రకటనలిచ్చిన కపిల్ సిబాల్ మాటల్లొనే వారి అధికారం వీగిపొయింది. ఇది చాలక ఈ విజయం కొసం మన్మొహన్, సొనియా లు చాలా కృషి చేసారని ముక్తాయింపు ఒకటి.

ఎన్నికలలో కేవలం 30-40 శాతం ఓట్లతో విజయం పొంది, మూడొంతుల ఆధిక్యం తో గద్దెనెక్కే తమకు తరువాత ఇక ఎదురు లేదనుకునే రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక.

కానీ ఇంతటితో ఈ సమరం ఆగకూడదు. ఈ చిగురేసిన మొక్కని అందరూ కలిసి పెంచి పెద్ద చేసి దాని ఫలాలను భావి తరాలకు అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి.  ఈ సామాన్యమైన పోరాటం ఏ రాజకీయ అండా దండా లేకుండా అనన్య సామాన్యం గా మారి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించాలి. ఈ గంగా ప్రవాహంలోకి ఏ కుళ్ళు రాజకీయ ఉపనదినీ కలవనీయకూడదు. ఏ కళంక నేతనూ ఈ వేదిక పైకి అనుమతించకూడదు.  ఏ అరాచకీయ, రాజకీయ నేతల అప్రస్తుత ఊకదంపుడు ప్రసంగాలూ ఈ ఉద్యమ కారుల చెవిలో పడకూడదు. ఈ బృహత్కార్యానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఎవరో వొకరు ముందుకు నడవాలి.

ఆ ఒక్కరే ఈ "అన్నా హజారే"

ఆయనకు ప్రజలకు మధ్య ప్రసార మాధ్యమాలు వేసిన వారధి కలకాలం కొనసాగాలి. ఈ వేడి చల్లరగానే అవి మళ్ళీ తమ మూస పోసిన పాత కార్యక్రమాల లోకి, పార్టీల భజన లోకి వెళ్ళకూడదు.

ఇంత జరిగినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేవరకూ దీక్ష విరమించానన్న 'అన్నా' నిజంగా అభినందనీయుడు. మన రాజకీయ నేతల నిరాహార దీక్షలు ఎన్ని చూడలేదు!!

అంకురం           ఒక పుట్టుక
                    ఓ కొత్త చిగురు
                    ఒక పులకింత
                    ఒక ప్రక్రుతి వింత 

ఈ అంకురం       ఒక ఉత్తేజం
                    ఒక చైతన్యం
                    ఒక యువ తరంగం
                    ఒక ఉద్యమం 
                    ఒక హెచ్చరిక 

అవినీతి పూసుకున్న నేతలారా... 
మాటలు ఆపండి... చేతలు చూపండి.
ఈ దేశం లో కూడా ...
ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు !!
మీ మెడలు వంచగలరు !!

జయహో భారత్ ప్రజ,  జైహింద్.

మల్లాది లక్ష్మణ కుమార్.

4, ఏప్రిల్ 2011, సోమవారం

ఖర నామ ఉగాది శుభాకాంక్షలు


ఈ ఉగాది పచ్చడి మీకోసం. తీరిగ్గా తరువాత పలకరించుకుందాం, ముందు స్నానం చేసి వచ్చి, ఈ కుంకుమ నుదుటిన ధరించి ఈ పూలతో పూజ చేసి, పచ్చడి రుచి చూడండి.

ఉగాది పండుగ వచ్చింది
                  ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
                 బాజాలయ్యాక పూజలు
ఊరేగింపు ముగిసాక
                 ఉత్సవాలు  జరిగాక
పంచాంగాలను చదివి
                  మంచిచెడ్డలు విన్నాము!
(మాగంటి.ఆర్గ్ నుంచి)

ఈ నవ వసంతం మీ జీవితాలలో నవ ఉషస్సులు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ప్రశాంతత నెలకొనాలని ఆ దేవ దేవుని ప్రార్ధిస్తూ....       ఖరనామ ఉగాది శుభాకాంక్షల తో ....

ఈ సందర్భం గా క్రితం సంవత్సరం "వికృతి" లో నేను ఈ భాగ్ముఖం గా ఇచ్చిన తెలుగు సందేశాన్ని, మళ్ళీ మీకోసం : (అప్పటికి నా ఈ బ్లాగు జనాల్లోకి రాలేదు)

 మళ్ళీ కొత్త  తెలుగు సంవత్సరం వచ్చేసింది!

తెలుగు తెగులు పట్టిన వాళ్ళకి ఇది ఒక పిండివంటల పండుగ (ఒక శెలవు) మాత్రమె కాని మన సంస్కృతీ సంప్రదాయం, దాని సొగసులు, సొబగులు ఏవి పట్టదు! ఇలాంటి/మీలాంటి వాళ్ళ కోసం ఈ వికృతి నామ సంవత్సరం లో ఒక ఝలక్!!!

భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో తెలుగు లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని . ఇంగ్లిషు  ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ. సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే .......
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్
ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్
ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్
ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు
ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం (ఇప్పటి సమాధానం - జై తెలంగాణా నా , జై ఆంధ్రా నా)

ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.

అదే, శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...
దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!

ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి..

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు - ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)
అందుకే, తెలుగువారికి అజరామరమయిన, అనిర్వచనీయమయిన భాషా సంపత్తిని వదిలి వెళ్ళిన తెలుగు కవులకు, రచయితలకు పాదాభివందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఈ సంవత్సరం అన్నా... 

తెలుగును మరవకండి, 
తెలుగును ప్రేమించండి, 
తెలుగువారిగా జీవించండి,
గర్వించండి.

మీ అందరికి ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ లోగిళ్ళు కలకాలం పచ్చగా సుఖశాంతులతో వెల్లి విరియాలని మీ జీవితాలు శుభప్రదం కావాలని మనసార కోరుతూ

మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది .