4, ఏప్రిల్ 2011, సోమవారం

ఖర నామ ఉగాది శుభాకాంక్షలు


ఈ ఉగాది పచ్చడి మీకోసం. తీరిగ్గా తరువాత పలకరించుకుందాం, ముందు స్నానం చేసి వచ్చి, ఈ కుంకుమ నుదుటిన ధరించి ఈ పూలతో పూజ చేసి, పచ్చడి రుచి చూడండి.

ఉగాది పండుగ వచ్చింది
                  ఊరికి అందం తెచ్చింది
దేవుడి గుడిలో బాజాలు
                 బాజాలయ్యాక పూజలు
ఊరేగింపు ముగిసాక
                 ఉత్సవాలు  జరిగాక
పంచాంగాలను చదివి
                  మంచిచెడ్డలు విన్నాము!
(మాగంటి.ఆర్గ్ నుంచి)

ఈ నవ వసంతం మీ జీవితాలలో నవ ఉషస్సులు, సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, ప్రశాంతత నెలకొనాలని ఆ దేవ దేవుని ప్రార్ధిస్తూ....       ఖరనామ ఉగాది శుభాకాంక్షల తో ....

ఈ సందర్భం గా క్రితం సంవత్సరం "వికృతి" లో నేను ఈ భాగ్ముఖం గా ఇచ్చిన తెలుగు సందేశాన్ని, మళ్ళీ మీకోసం : (అప్పటికి నా ఈ బ్లాగు జనాల్లోకి రాలేదు)

 మళ్ళీ కొత్త  తెలుగు సంవత్సరం వచ్చేసింది!

తెలుగు తెగులు పట్టిన వాళ్ళకి ఇది ఒక పిండివంటల పండుగ (ఒక శెలవు) మాత్రమె కాని మన సంస్కృతీ సంప్రదాయం, దాని సొగసులు, సొబగులు ఏవి పట్టదు! ఇలాంటి/మీలాంటి వాళ్ళ కోసం ఈ వికృతి నామ సంవత్సరం లో ఒక ఝలక్!!!

భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు"(1948)పుస్తకం లోని ఒక అద్బుతమయిన ప్రసంగం.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో తెలుగు లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానాలు వినపడతాయి అని . ఇంగ్లిషు  ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ. సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే .......
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్
ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్
ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్
ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు
ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!
ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!
ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు
ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట
ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం
ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?
ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.
ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు
ప్రశ్న - తెలుగులో పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడాని కోసం
ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.
ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లేడు.
ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు
ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు
ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు
ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!
ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి
ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు
ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం (ఇప్పటి సమాధానం - జై తెలంగాణా నా , జై ఆంధ్రా నా)

ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ.

అదే, శ్రీ కూచి నరసింహము గారు 1923లో వ్రాసిన పత్రికావిలేఖనములు అనే రచనలో పాతతెనుగు గురించీ, కొత్తతెలుగు తమాషా గురించి - వరహాల్రావు అనే ఒక విద్యార్థి పాత్రచేత ఏమనిపిస్తారంటే...
దేఁవుడికి దణ్ణాలు! దేఁవుడికి దణ్ణాలు!
కొత్తతెను గొచ్చింది! కోత్తెనుగు సచ్చింది !
దిక్కుమాలిన పాతతెనుగు పోతూవుంది
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
'ఉప్మాలు' లే విహను 'ఉత్తపీచు' ల్లేవు
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
చదవకుండా తెనుగు చచ్చిన ట్లొస్తుంది
రాకేం జేస్తుంది రావడం లేదా?
'ప్రాఁదెనుఁగుఁగమ్మంటి పాత్తెనుగు తొంగుంది'
బతికాఁవ్ రా! బాబు! బతికాఁవ్ రా!
సంధులూ గిందులూ చచ్చుసూత్రాలన్ని
పోయాయ్ ! పోయాయ్! పోయాయ్ రా!
మన భాషలో ఫెయిలు మాఁయఁవై పోయింది
మార్కులన్నీ మనవె! మరేఁవి టున్నాది!
బూతుమాట ల్లేని పొస్తకా లన్నిన్ని
బారతా లవ్తాయి! పాఠాల కొస్తాయి!
చూడడం, చదవడం, చూపించడం, దిద్ది
తన్నడం, తిట్టడం, తప్పిపోయిందిరా!
యింతసులభ బ్భాష యిహయెక్కడున్నాది?
దాన్ని దెచ్చినవాళ్ళు దైవాలు! దైవాలు!

ఫలశ్రుతి కూడ చెప్పిస్తారు ఆ ప్రథమ తరంగానికి..

శా. స్కూల్ఫైనల్తెలుగందుమార్కులుఘనఁవ్, ఇంటర్ప్రవేశంధ్రివఁవ్
తప్పుల్రాశిన తప్పులంటు నోరెత్తకుం డుండడఁవ్
పూర్వగ్రంధఁవులన్ని మూలబడడఁవ్, రావంటు - ఊమూల్గడఁవ్
భాషంతాచెడదీశి కూచుని లబోలబ్బోయటం చేడ్వడఁవ్
(ఈ పైన చెప్పబడినవి మాగంటి.ఆర్గ్ వారి సౌజన్యం తో, దయ చేసి గమనించగలరు. చక్కనైన తెలుగు సాహిత్యానికి, ముచ్చటైన కూర్పులతో సమస్త తెలుగు భాష సంగ్రహం తో ఉన్న http://maganti.org ని కూడా సందర్సించగలరు.)
అందుకే, తెలుగువారికి అజరామరమయిన, అనిర్వచనీయమయిన భాషా సంపత్తిని వదిలి వెళ్ళిన తెలుగు కవులకు, రచయితలకు పాదాభివందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు
ఈ సంవత్సరం అన్నా... 

తెలుగును మరవకండి, 
తెలుగును ప్రేమించండి, 
తెలుగువారిగా జీవించండి,
గర్వించండి.

మీ అందరికి ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు, మీ లోగిళ్ళు కలకాలం పచ్చగా సుఖశాంతులతో వెల్లి విరియాలని మీ జీవితాలు శుభప్రదం కావాలని మనసార కోరుతూ

మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది .






31, మార్చి 2011, గురువారం

మీకు ఒక బ్రహ్మానంద భరితమయిన సన్నివేశం చూపిన్చదలుచుకున్నాను. ఈ క్రింది చిత్రం చూడండి:

చిక్కాడు చేతిలో బావ  
ఒకాయన వేరొక యువకుని చేతిలో గోరింటాకు దిద్దుతున్నాడు. ఆ సన్నివేశం ముగ్గురూ ఆస్వాదిస్తున్నారు, ఆ భావాన్ని మొహం లో చూపిస్తూ.

విష్యం ఏమిటంటే, కుడి పక్కనున్న శంకరానికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆ హడావిడిలో బావ సుబ్రహ్మణ్యం (ఎడమ) ఇతని చేతిలో సరదాగా....  ఇలా గోరింటాకు పెడుతూ మూడో కంటికి చిక్కాడు. వెనక చిరునవ్వులు చిందించే ఆయన ఇంకొక బావ, అయన పేరు కూడా సుబ్రమణ్యం , కాకపోతే ఘనాపాటి గారు.

ఈ సన్నివేశం లో వీళ్ళ మోముపై చూపించిన బ్రహ్మానంద భరితమైన భావాలు నాకు బాగా నచ్చి ఈ చిత్రాన్ని మీ వరకు తీసుకొచ్చాయి.


ఈ చిత్రానికి మీ వ్యాక్యాలు హాస్యభరితం గా తెలియచేయండి. ఈ పెళ్ళికొడుకు కు కానుకగా నేనన్దిస్తాను.

ఉంటాను
లక్ష్మణ కుమార్ మల్లాది.

24, ఫిబ్రవరి 2011, గురువారం

చిన్నారి బుడుగు ఏడుస్తున్నాడు !!



తెలుగు భాష కి యెనలేని సేవలు చేసి మాలాంటి వారికి భాష మీద మక్కువ పెంచి తన చుట్టూ తిప్పుకున్న మహా మహుడు, రచనారావిన్దుడు, మన ముళ్ళపూడి వెంకట రమణ గారు దూర లోకాలు చేరారు. ఇక బాపు బొమ్మ ఏ బుడుగు తో ఆడుకుంటుంది, పాడుకుంటుంది, కబుర్లు చెప్పుకుంటుంది??

పాపం చిన్నారి బుడుగు ని దగ్గరకు తీసుకోండి, లాలించండి, మీ గుండెల్లో పెట్టి పెంచుకోండి.

ఆ ఆంధ్రాగ్రేసరునికి నివాళులతో

లక్ష్మణ కుమార్ మల్లాది.

ఆ రోజుల్లో ... రేడియో లో...

నిన్న దృశ్య శ్రవణ పెట్టె (అదేనండీ టెలివిజన్) చూస్తూ మీటలు మారుస్తూ అనుకోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి కార్యక్రమం లో సూర్య భగవానుని పూజల గురించి చెపుతుంటే ఆసక్తిగా చూస్తున్నాను. చివర్లో సూర్య నారాయణుని సుప్రభాతం వినిపించారు.  ' శ్రీ సూర్య నారాయణా  ... మేలుకో... హరి సూర్య నారాయణా .... అంటూ మొదలవుతుంది. 

నా పాత పుటలలో రాసినట్లు గా  భక్తిరంజని, ఆకాశ వాణి లో వినిపించే మధుర రాగాల గానలహరి వెంటనే గుర్తోచ్చేసింది. సూర్యుని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది.

"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."

అంటూ పొద్దు పొడుస్తున్న సూర్య బింబాన్ని వర్ణించటం మధురానుభూతి నిస్తుంది. అలాగే "మధ్యాన్న భానుడు  మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడి ఛాయ ... "    అంటూంటే నేను నిజం గా నా చిన్న తనం లోకి వెళ్ళిపోయాను.  చిన్నప్పుడు మా ఇంట్లో ఉదయం రేడియో లో వినపడే వందేమాతరం తో నే తెల్లారేది. అప్పటికి లేచి దంతధావనం కానిచ్చే లోపల నాద స్వరం, ఆంగ్ల వార్తలు అయిపోయి ఆ రోజు భక్తిరంజని కార్యక్రమం  లో ఏం వస్తుందో నని ఉత్కంత గా ఉండేది. వారాన్ని బట్టి వివిధ దేవతలా స్తోత్ర తరంగిణి వినిపించే వారు. వోలేటి వెంకటేశ్వర్లు గారి భజగోవిందం, బాలాంత్రపు వారి సూర్యాష్టకం, పైన చెప్పిన సూర్య నారాయణ స్తోత్రం బృంద గానం, రామా రావు గారి హనుమాన్ చాలీసా, శివ స్తుతి, మధురాష్టకం (మధురం మధురం అంటూ యెంత మధురం గా వినపదేదో), బాల మురళి తత్వాలు, రామదాసు కీర్తనలు, శ్రీరంగం గోపాలరత్నం పాటలు, మల్లిక్ గారి రాజ రాజేశ్వరీ స్తోత్రం... అలా అన్నీ మధురాలే.

మల్లిక్ గారి స్తోత్రం మంద్రం గా పవిత్రం గా రాగ యుక్తం గా వాయులీన నేపద్యం లో వినపడుతుంటే రోజు మొదలెట్టటం చాలా ఆనందం గా ఉండేది. చాలా అరుదుగా ఈ మధ్య దీన్ని ప్రసారం చేస్తున్నారు. దాన్ని వింటూ గతం లోకి పరుగెత్తటం బాల్యానందాన్నిస్తుంది.

ఈ కార్యక్రమం తరువాత పొలం పనులు, వెంటనే ప్రాంతీయ వార్తలు, జాతీయ వార్తలు వచ్చేవి. మధ్యలో ఎక్కడో సంస్కృతం లో కూడా వార్తలు ఉండేవి. "ఇయమాకాషవాని! సంప్రతి వార్తః సుయంతం, ప్రవాచికః బలదేవానంద సాగరః" అంటూ వణుకుతూ వుండే గొంతు తో ఆ పెద్దాయన వార్తలు చదువుతుంటే ఏమిటో ఆ చిన్న వయసు లో కూడా ఏదో కొత్తది వినేస్తున్నాననిపించేది. "ఆగచ్చ! ఉపనిష్!" అంటూ పంతులు గారు చెప్పే సంస్కృత పాఠం తో పాటు, మా ఇంట్లో ఉదయపు ఉపాహారం తయారయ్యేది. చాలా రోజులు పెసరట్టు ఉప్మా లే మెను. అల్లం పచ్చడి  రుచి అదనం.

(ఆ భోగం కూడా ఎంతమందికి వుంటుందో .. అదృష్టవంతులు.  పచ్చిమిరపలు ,  అల్లం, జీలకర్ర  జమాయించి చేసి వేసిన పెసరట్టు  రుచి  విజయవాడ బాబాయి హోటల్లో తప్పితే వేరే  చోట  దొరకగాలదంటారా  .. ఈ రోజుల్లో   అదికూడా  అందని ద్రాక్ష అయిపొయింది.  మరుగున పడుతున్న తెగులుపట్టిన  తెలుగు లాగా. మొన్నామధ్య  ఓ చుట్టం  పెళ్ళిలో అల్పాహారం గా పెసరట్టు ఉప్మా పెట్టిస్తే, వేడి వేడి గా అందరూ సుబ్బరంగా సుష్టు  గా లాగించేసి ఈ ఆలోచన చేసిన ఆయన్ని మనసులో అభినందిన్చుకున్నారు.)

అది తిన్న వెంటనే మేం బడికి వెళ్ళే సమయం అయ్యేది. ఎనిమిది గంటల తరువాత వచ్చే ఈ మాసపు పాట, ఇతర కార్యక్రమాల మధ్యలో వచ్చే లలిత గీతాలు తెలుగు నుడికి, వడి కి , సరళమైన పదాల్లో కుదించి చెప్పే భావ ప్రకటన అనన్య సామాన్యం. దేవులపల్లి, బాలాంత్రపు రజని, నండూరు సుబ్బా రావు, దాశరధి వంటి మహనీయుల గీతాలు హృద్యం గా ఉండేవి. ఇక తొమ్మిది గంటల తరువాత, మధ్యాహ్నం పన్నెండు తరువాత వచ్చే శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాంతీయ కళాకారుల తో సంపన్నం అయ్యేవి. అవి వింటూ తేనీరు తాగుతూ చదువుకుంటూ ఉండేవాడిని. కార్మికుల కార్యక్రమం, ఒకటిన్నరకు స్త్రీల కార్యక్రమం, సాయంత్రం యువజనుల కార్యక్రమం దేనికదే విభిన్న కార్యక్రమాల సమాహారం గా అలరించేవి.

ఆ కార్యక్రమాలే కాకుండా వాటి మొదలులో వచ్చే నేపధ్య బాణీలు దేనికవే ప్రత్యేకం గా వినసొంపుగా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చే విధం గా ఉండేవి.  మీరు కనక వాటిని వింటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. యెంత బాగుండేవో కదూ. చిన్నక్క ఎకంబరం కబుర్లు, ఉషశ్రీ ధర్మ సందేహాలకి సమాధానాలు, బాలానందం లో రేడియో అక్కయ్య ముచ్చట్లు, పల్లె పదాలు, జానపద బాణీలు, స్త్రీల పాటలు, మధ్య మధ్యలో అలనాటి వెండితెర పాటలు, ఆ నాటి కొత్త పాటలు... వ్యాఖ్యాతల చతురతలు...  ఆదివారం మధ్యాన్నం నాటకం కోసం ప్రత్యేకం గా ఎదురు చూసేవాన్ని. (టెలివిజన్ వచ్చిన కొత్తలో చిత్రలహరి కోసం చూసినట్టుగా) నండూరు సుబ్బా రావు నాకు ఇష్టమైన నటుడు. ఆయన వాచికం ఇంచుమించు జగ్గయ్య గారి వాచికం లా తాజా గా ఉండేది. కృష్ణ మూర్తి - కుక్కపిల్లలు అన్న నాటకం లో ఆయన పండించిన హాస్యం ఇప్పటికీ నా చెవుల్లోనే వుంది.

ఇక వార్తల విషయానికొస్తే, ధిల్లీ వార్తలలో అ అ అ ... ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది ..." అంటూ తడబడుతూ మొదలెట్టే కందుకూరి సూర్యనారాయణ, ఎవరో తరుముకొస్తున్నట్టు చదివే అద్దంకి మన్నార్, ఇలియాస్ అహ్మద్, ఏడిద గోపాల రావు, ప్రాంతీయ వార్తలు చదివే కోక సంజీవ రావు, కొప్పుల సుబ్బా రావు, వ్యాఖ్యాతలు పాలగుమ్మి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, మల్లాది సూరి బాబు ఇత్యాది మహా మహులందరూ నా జ్ఞాపకాలలో ఇంకా పదిలం గా ఉన్నారు.

ఈ తలపులన్నీ గురుతుకు రాగా ఇందాకే అంతర్జాలం లో అలనాటి భావ/లలిత/భక్తీ గీతాలకై వెతుకులాడాను, మళ్ళీ విందామని లేదా పొందుదామని. కొంతవరకు మన తెలుగు వీధి గుమ్మాలలో (అంటే సైట్లలో అని కవి హృదయం) రా రాజు అని నేననుకునే "మాగంటి.ఆర్గ్" లో విని నా జ్ఞాపకాలని తాజా గా ఉంచుకున్నాను.  మీరూ ఆ వీధి వాకిట్లో వుండే గోవు వెనక ఆ ఇంట్లో కి చేరి అలరించే వీటిని చదివి, విని ఆనందించ గలరని భావిస్తూ..

ఇంకొక్క మాట...   పైన చెప్పిన వాటిలో మీ వద్ద ఏదైనా దొరికితే నాకు పంప గలరని అర్ధిస్తూ , మళ్ళీ ఆలస్యం చేస్తే రాయటం మరిచి పోతానని మీకు సమర్పిన్చేసుకున్తున్నాను.

మీ
 మల్లాది లక్ష్మణ కుమార్.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

'సరస వినోదిని - సమస్యా పూరణం'

మన తెలుగులో మాత్రమె ఉన్న సాహితీ ప్రక్రియలలో ఒకటి  'అవధానం '  అని చాలా మంది భాషా వేత్తలు సెలవిచ్చారు. ఇప్పటివరకు ప్రత్యక్షం గా వీక్షించలేక పోయినా, మన ప్రసార మాధ్యమాల వలన కొంతవరకు ఆ ప్రక్రియ ప్రాశస్త్యాన్ని తెలుసుకోగలిగాను. ప్రస్తుతం ఉన్న శతావధాను లలో ప్రముఖులు  గరికపాటి వారు, మేడసాని మోహన్ గారు, వద్దిపర్తి పద్మాకర్ గారు, రాల్లభండి కవిత ప్రసాద్ గారు ఇంకా అలా అలా....

నేను ఒక వార్తా పత్రికలో చదివి దాచుకున్న కొన్ని పద్యాలు ఇటీవల మళ్ళీ చూడటం జరిగింది. బ్రహ్మశ్రీ మేడసాని మోహన్ గారు చేసిన ఒక శతావధానం లో (తొంభై లలో జరిగింది అనుకుంట) పలికిన కొన్ని పద్యాలు ఇవి. మీరూ పరికించి ఆనందించండి. తెలుగు భాష సొగసు, సొబగులు మీరు కూడా గ్రోలండి:

- నడ్డి, మెల్ల, గూని, గారపండ్లు ఈ శబ్దాలతో పద్యం రాయమని కోరినపుడు :

ఒకట గనన్ వరూధిని ఉన్నదో లేదొకో 'నడ్డి', ముక్కునన్
ప్రకటిత చంపక స్ఫురణ భాసిలు నాక్రమ'మెల్ల', కన్నలన్
వికస వనౌజ పత్రముల ఎల్లడారన్ బెడ'గూని', వీపు వి
శ్వకలిత మారుపేట విరజాజుల వెన్నల 'గార పండ్లు'నై

-సైకిలు, రిక్షా, ఆటో, మోటారు ఇత్యాదులైన వాహన శబ్దాలతో పద్యం:

ధాటీ భాసుర లీల 'సైకిల' కిల ధ్వానమ్ము లేపార వా
గ్ధాటిన్ మించినయట్టి ఫల్గుణుడు క'రిక్షా'న్తిన్ నివారించి తా
'నాటో' పమ్మును జూపె గోగ్రహణ వేలాక్రాంత విభ్రాంతియే
'మోటారె'త్తెను  చిత్త మత్తమునకున్ మోదంబు పారమ్మునన్.

- ప్రేక్షక హృదయాలు దోచిన చలన చిత్ర తారలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున శబ్దాలు ఉపయోగించి:

స్థిర దీర్ఘంబగు వాలముంగల్ 'చిరంజీవీ' భవత్ సత్క్రుపా
ఝరి వర్షింపుము రాక్షపోరు లహరీ! జం'బాల క్రిష్ణ'క్రియా
సరస శ్రీకర 'వెంకటేశ' పదసంచారా! హనూమంత వా
నర ముఖ్యా! దను జొళి గూర్చెదవు పు'న్నాగార్జున'శ్రేణిగన్

ఇక సమస్యా పూరణం లో 'సతికి మెట్టెల కంటే మీసములె అందం' అన్న సమస్యను పూరించిన విధము:


హాస్య ప్రసంగ వేళా
వ్యాసాంగ వచః ప్రసంగ మప్పటి సుఖమున్
వేసారి చూచుకో పతి
'మీసము లందమ్ము సతికి మెట్టెల కంటెన్'

ఇవండీ ఆ విశేషాలు.  మీకు నచ్చాయని భావిస్తూ... అచ్చు తప్పులుంటే క్షమించమని ప్రార్ధిస్తూ...
శుభం భూయాత్.

మీ
మల్లాది లక్ష్మణ కుమార్