21, జూన్ 2011, మంగళవారం

'ఏకరువు'

సాయంత్రం నాలుగున్నర దాకా పని లేక బోరుకోట్టి చచ్చి చచ్చి, ఎలాగోలా ఈ రోజు ఆఫీసు అయిందనిపించి, కొట్టు (బట్టల కొట్ట్తో, పచారీ కొట్ట్తో కాదు, మా బ్యాంకు) కట్టేద్దామని తాళం వేయించ  పోతూ ఉంటె, ఒక జులపాల జుట్టు వాడు కారు దిగివచ్చి డెనిం జీన్స్ మీద ఎర్ర టీ షర్టు రేబాన్ కళ్ళద్దాలతో  చేతిలో కార్డు పట్టుకొని దిక్కులు చూస్తూ, అంతా  వెతుక్కుని ప్రశ్నార్ధకం లా నుంచుంటే ఎవడా వచ్చినిది అని  చూస్తూంటే, హి హి హి ఏ టీ ఎం ఉందండీ అంటూ వచ్చే ఆ విద్యాదికున్ని పిచ్చాడిలా చూసి, అబ్బెబ్బే లేదండీ అని నవ్వుతూ సాగనంపి మనసులో బోర్డు చూడటం కూడా రాదా ఈ వెధవకి ని తిట్టుకుని ద్విచక్ర వాహనం తీసి ఇంటికి బయల్దేరి, మధ్యలో కనిపించిన ఆ వాహనం అమ్మిన ఏజెన్సి వాడిని వెధవ బండి అమ్మావు, డుర్రు డుర్రు మని శబ్దం వస్తోంది అని వాణ్ణీ మనసు లోనే తిట్టుకొని, ఇంట్లో కూరలు లేవన్న విష్యం గుర్తొచ్చి, వాహనాన్ని సందు మొదట్లో సురేష్ కొట్టు దగ్గర ఆపి, అక్కడ ఉన్న పుచ్చు చ్చచ్చు వాడిపోయిన కూరలు చూసి విసుకుపుట్టి ఆదివారం అవటం వలన కూరల కొట్టు వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడా దొరక్క, దారి తప్పి వేరే సందులోకి వెళ్లి రోడ్డంతా కంకర పోసి ఉండటం వలన బండి బెదిరి, బెసికి తక్కుతూ తారుతూ అతి కష్టం మీద ఆ రోడ్డు బయట పడి  మళ్ళీ ఆ సురేష్ కొట్టు కే వెళ్లి ఆ కూరలే కొని, దుమ్ము ధూళి లో నలిగి, ఎండకు కమిలి చీకాకు పుట్టి ఇంటికి దారితీసి తాళం తీసి స్నానం చేద్దామని బాత్రుము కు వెళ్లి పంపు తిప్పితే,....    దేముడా... నా ఖర్మ కాలి నీళ్ళు రావాయే....

చెన్నపట్నం మహానగరి లోని మడిపాక్కం అను ఈ పంచాయితీ కుగ్రామా నగరం లో మొన్న అనగా ఆదివారం ఇలా జరిగింది. ఏదో ఇలా జరిగిందని ఏకరువు పెట్టాను, ఏమనుకోకండే!!!

మీ
మల్లాది లక్ష్మణ కుమార్

(సాహితీ ప్రియులకు తప్పనిసరిగా ఒకటి గుర్తొచ్చే వుంటుంది. చాసో గారి 'ఏకరువు' కథ. ఏదో దానిని అనుకరిద్దామని సరదా గా ఇలా రాసాను. మళ్ళీ ఏమనుకోకండే ???!!!)

9, జూన్ 2011, గురువారం

వింత కొలిపే ఒక ఆకాశ చిత్రం

ఈ మధ్య ఆకాశం లో కొత్త రంగులు చూస్తూ కెమెరా లో బంధిస్తుండగా తీసిన ఒక వింత కొలిపే చిత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటె దానిలో ఆకాశం లో ఎగురుతున్న వీర హనుమాన్ ఒక చేతిలో గద మరొక చేయి గాలిలో చాపి వెడుతున్న రకం గా స్పష్టం గా కనిపిస్తోంది. దీనిని చూపి ఇదేదో భగవంతుని మాయ, ఆంజనేయుడు గాలిలో వెలిసాడు అని నేను చెప్పదలుచుకోలేదు గానీ, ఇదొక ఆశ్చర్యమైన చిత్రం గా అనిపించి మీ ముందు ఉంచాను. మేఘాల వింత సోయగం ప్రతి క్షణం విచిత్రం గా మారుతూండడం రక రకాల అనుభూతుల్ని అందించటం, ఆకారాల్ని దాల్చటం ప్రక్రుతి వింతయే కదా. దయచేసి గమనించండి, ఇది నేను సృష్టించినది కాదు, సొల్లు ఫోన్ లో సహజం గా తీసిన ఆకాశ చిత్రం.

ఆ చిత్రం మీరూ చూడండి:



మరిన్ని ఆకాశ చిత్రాలను ఈ లంకె పై చూడగలరు: ఆకాశ చిత్రాలు (రంగుల ప్రపంచం)

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది 

అభ్యర్ధన: మీరు నా అభిమానుల జాబితా లో చేరనే లేదు. దయచేసి మీ పేరు కుడిప్రక్క గల అనుసరించు వారి జాబితా డబ్బా లో నమోదు చేసుకో గలరు. చేసిన వారికి ధన్యవాదాలు.

20, మే 2011, శుక్రవారం

మధురం ఈ రాగం ...


ఈ మధ్య బ్లాగుల్లో చూసి నేర్చుకున్న విష్యం ఏమిటంటే మనకి నచ్చిన పాటలను మీకు బ్లాగ్ముఖంగా వినిపించవచ్చును అని.  ఈ విషయమై ఒక బ్లాగరు ను సంప్రదించగా వారు ఇచ్చిన సలహా మేరకు నాకు మొదటగా నచ్చిన ఒక పాట ను మీకు వినిపించ దలుచుకున్నాను. అసలు మొదటిసారిగా నేను ఇంతకు ముందు పుటలలో చెప్పిన ఆకాశవాణి వారి "రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను. కానీ అవి ఆకాశవాణి వారి ఆంతరంగిక రక్షణ (rights protected ) చే రక్షించబడటం వలన embaded సూత్రం జనించక (ఆ స్తోత్ర రాజాన్ని మీరు ఈ లంకె ద్వారా పొంది  వినవచ్చు:    స్తోత్రం   ) ఆ ప్రయోగం మానుకుని, మన ఘంటసాల గారి  ఆ పాత మధురాల లో నుంచి 'రసికరాజ తగువారము కామా .....' అన్న జయభేరి చిత్రం లోని ఒక పాట రాజాన్ని నా మొదటి ప్రాధాన్యతా క్రమ పట్టిక నుంచి బయటకు తీసి రికార్డు వేస్తున్నాను. విని ఆనందించండి. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ పాత గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను.



పేరు పొందిన వేదికల మీదనుంచి రకరకాల గాయకులూ ఈ పాట ను పాడటానికి ప్రయత్నించగా చాలా సార్లు నేను విన్నాను. కానీ, అసలు ఉన్నంతగా కొసరు ఉండక, అంత రుచి రాలేదు.  ఒక పోటీ లో మన 'శ్రీరామచంద్ర', అదేనండీ సోనీ వారి గాయక సామ్రాట్, అలవోకగా ఘంటసాల లెవెల్లో అతి మధురం గా గానం చేసాడు. ఆ పోటీలో నెగ్గక పోయినా రచ్చ గెలిచి ఇంటికి తిరిగి వచ్చాడు. సాంప్రదాయక సంగీత బాణీ లో ఉన్న ఈ పాట ను మీరు తప్పక ఇష్ట పడతారని ఆశిస్తూ...

ఒక్క క్షణం ఆగండి... ఏమండీ! ప్రక్కన నేను కొత్తగా చేర్చిన సభ్యుల జాబితా చూసారా, ఎవరూ సభ్యులు లేక నేనే మొదటి వాణ్ని అవ్వాల్సి వచ్చింది. మీకు ఏ మాత్రమైనా నా కబుర్లు నచ్చినా నా బ్లాగు ను అనుసరిస్తూ, సభ్యులు  గా చేరి నాను ఆదరించగలరు.       సరేనా!!!  

మరిక సెలవా మరి...

మీ
లక్ష్మణ కుమార్ మల్లాది



12, ఏప్రిల్ 2011, మంగళవారం

శ్రీ రామ నీ నామ మెంత రుచిరా !!!


కౌసల్యా సుప్రజా రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూలా కర్తవ్యమ్ దైవమాన్హికం

శ్రీరామ రామ రామేతి , 
రమే రామే మనోరమే;

సహస్ర నామ తతుల్యం, 

రామ నామ వరాననే. 

'రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత, భక్తీ, అనుభూతి ఉన్నాయి. అందుకనే గామోసు అప్పటి హనుమాన్ నుంచీ భక్త శబరి, వాల్మీకి, త్యాగయ్య, రామదాసు మళ్ళీ తరువాతి కవిజనం ఆ భక్తీ భావం లో మమేకమై మనకి మంచి కృతులని, గీతాలని, పాటలనీ అందించారు. ఇక సీతారామ కల్యాణం జగత్ప్రసిద్ధం. భద్రాద్రి లో జరిగే ఈ వేడుక పండిత పామర జనరంజకం గా వైభవం గా జరుగుతుంది.

గంగా నది చూస్తె యెంత పవిత్ర భావం కలుగుతుందో, శివాలయం లో కార్తీకం లో డమరుక నాదాలతో విభూతి పరిమళాలతో శివలింగం చూస్తె (నా చిన్నప్పుడు బందరు లో ఖోజ్జిల్లుపేట శివాలయం లో కార్తీక మాసం ప్రతీ రోజూ రాత్రి వివిధ హారతులు ఇస్తూంటే, డోలు, ధమరుకాలతో నందీశ్వరుడు, శివుడు దిగివచ్చినట్టు గా వింత వింత నాదాలతో గర్భగుడి ప్రతిధ్వనిస్తూంటే ఒడలు పులకరించేవి) ఎంత వింత అనుభూతి కలుగుతుందో, శ్రీ రామ నవమి నాడు స్వయం గా చేయకపోయినా ఆ కళ్యాణ ఘట్టం తలుచుకుంటే అంత అనుభూతి. క్రితం సంవత్సరం ఈ రోజు (శ్రీ రామ నవమి నాడు) నేను రాసిన నా  జ్ఞాపకాల గురించి చదవాలనుకుంటే    ఇక్కడ      చూడండి.  
స్వామివారి వడపప్పు, పానకాలు జనులందరూ మెచ్చే ప్రసాదాలు.

జనన మరణ భయ శోక విదూరం

సకల శాస్త్ర నిగమాగమ సారం 
పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం
అటువంటి ఈ రామ ప్రసాద రసం, పానకాన్ని కరువుతీరా గ్రోలండి.

రామ భక్తీ సామ్రాజ్యం,
ఏ మానవుల కబ్బెనో మనసా.. అని త్యాగయ్య ప్రశ్నించు కున్నాడు.

అలాగే...

ఆ మానవుల సందర్శనం
అత్యంతా బ్రహ్మానందమే మనసా...

అని కూడా ఆనందపడ్డాడు.

ఆ ఆనందాన్ని తమ  ప్రతి చిత్రం/చలన చిత్రం లోను రామ భక్తి చూపించిన బాపు రమణలు ధన్యులు.  ఆ రాముని భజియించినట్టి భక్తాగ్రేసరు లందరూ ధన్యులు.


లోక కళ్యాణార్ధం ప్రతీ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శుభ ముహూర్తాన జరుగే సీత రామ కల్యాణం ప్రజలందరికీ శుభకరం, మంగళ దాయకం. భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు ఇక్కడ మననం చేసుకుందాము:


శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు 
ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో 
త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!


చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో 
మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా 
మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!


రాముడు, ఘోర పాతమ విరాముడు, సద్గుణ  కల్పవల్లి కా 
రాముడు, షడ్వికారజయరాముడు, సాధుజనావన వ్రతో 
ద్ధాముడు, రాముడే పరమ దైవము మాకని మీయడుంగు కెం
దా మరలే భజించెదను, దాశరథీ! కరుణాపయోనిధి!


మీ కందరికీ శుభం కలగాలని కోరుతూ...




మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.


మీ 
లక్ష్మణ కుమార్ మల్లాది 

9, ఏప్రిల్ 2011, శనివారం

అంకురం... ఒక హెచ్చరిక


ఎవరొ ఒకరు                       
ఎపుడో అపుడు
నడవరా ముందుగా            
అటొ ఇటొ ఎటోవైపు...


(అంకురం అన్న తెలుగు చలన చిత్రం లో నుంచి) 

ప్రజల కోసం... ప్రజా సమరం... ప్రజా విజయం

అవినీతిని అంతమొందించటానికి, భ్రష్తాచారాన్ని తుదముట్టించడానికి ఉద్యమించిన ఒక సామాన్యుడు ప్రజల మద్దతుతో, ఏ రాజకీయ కొణం లేకుండా, దేశమంతా వెల్లువెత్తిన ప్రజాభిమానం తొ సాధించిన తీరు ... అభినందనీయం.

ఇది ఒక అంకురం. ఆ చిగురుని ఆదిలొనే ఎండకట్టకుండా వ్రుక్షాన్ని చేయవలసిన బాధ్యత మేధావులు, యువత, ప్రజ, మనందరిమీదా ఉంది.

చిత్రమేమిటంటె, ఇన్ని సంవత్సరాల నించి ఆ బిల్లు అమోదం పొందకుండా చేసిన రాజకీయ పార్టీలు, నేతలు (ఇలా అని ఎందుకనాలంటె, పార్లమెంటులొ ఒటు వేసెది అమోదింపచేసేది వారే కాబట్టి), ఇపుడు టీవీ లొ చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తాయి, వారికసలు సిగ్గె లెదా అని అనిపిస్తుంది. ఒక ఎన్నికల పోటిదారుదంటాడు  .. "ఈ స్ఫూర్తి తొ అవతల పార్టీ వారు చేసే నొట్ల పంపకం, అవినీతి అడ్డుకుంటానని". మరి ఇప్పటిదాకా ఈయనెం చెసాడో. జనాలు నవ్వుతారని కూడా చూడకుండా , ఈ చైతన్యాన్ని కూడా ఒట్ల కోసరం వాడుకుందామని ఆయన యత్నం.

ఈ విజయ ప్రకటన వచ్చిన సమయం లొ ఒక టీవీ చర్చా కార్యక్రమం లొ పాల్గొన్ననేత ఒకామె(టైంస్ నౌ చానెల్ లొ, పేరు మీనాక్షి రెడ్డి) ముఖం లొ భావమేమీ లేకుండా పెడసరం గా విసిరిన మాటలు పాల్గొనే వాళ్ళనే కాక చూసె వాళ్ళకు కూడా విసుకు, కోపం తెప్పించాయి. ఇక మన రెణుకా చౌదరి అయితె, ఇదేదో రాజకీయ పార్టీల, నేతల పైనే జరుగుతున్న పొరాటంలా వర్ణించి తన అసహనాన్ని వ్యక్తం చేసారు. అవినీతి బురద అంటించుకున్న ఈ ప్రభుత్వం లోని రాజాలు, కల్మాదీలు, ఆదర్ష్ కాలనీలు ఇలా...  ఇవన్నీ ఈ రాజకీయ కొణం లొని భాగాలే.

ఇకపొతే, చేసేదేమీ లేక, కేవలం మూడు రొజుల్లొనే విజయవంతం గా ముగిసిన ఈ రాజకీయేతర విప్లవానికి తల వంచలేక, వంచలేక వంచిన కాంగ్రేస్, ఇది ప్రభుత్వం దిగివచ్చినట్లు కాదనీ ప్రజాస్వామ్య విజయం అనీ రక రకాలుగా ప్రకటనలిచ్చిన కపిల్ సిబాల్ మాటల్లొనే వారి అధికారం వీగిపొయింది. ఇది చాలక ఈ విజయం కొసం మన్మొహన్, సొనియా లు చాలా కృషి చేసారని ముక్తాయింపు ఒకటి.

ఎన్నికలలో కేవలం 30-40 శాతం ఓట్లతో విజయం పొంది, మూడొంతుల ఆధిక్యం తో గద్దెనెక్కే తమకు తరువాత ఇక ఎదురు లేదనుకునే రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక.

కానీ ఇంతటితో ఈ సమరం ఆగకూడదు. ఈ చిగురేసిన మొక్కని అందరూ కలిసి పెంచి పెద్ద చేసి దాని ఫలాలను భావి తరాలకు అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి.  ఈ సామాన్యమైన పోరాటం ఏ రాజకీయ అండా దండా లేకుండా అనన్య సామాన్యం గా మారి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించాలి. ఈ గంగా ప్రవాహంలోకి ఏ కుళ్ళు రాజకీయ ఉపనదినీ కలవనీయకూడదు. ఏ కళంక నేతనూ ఈ వేదిక పైకి అనుమతించకూడదు.  ఏ అరాచకీయ, రాజకీయ నేతల అప్రస్తుత ఊకదంపుడు ప్రసంగాలూ ఈ ఉద్యమ కారుల చెవిలో పడకూడదు. ఈ బృహత్కార్యానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఎవరో వొకరు ముందుకు నడవాలి.

ఆ ఒక్కరే ఈ "అన్నా హజారే"

ఆయనకు ప్రజలకు మధ్య ప్రసార మాధ్యమాలు వేసిన వారధి కలకాలం కొనసాగాలి. ఈ వేడి చల్లరగానే అవి మళ్ళీ తమ మూస పోసిన పాత కార్యక్రమాల లోకి, పార్టీల భజన లోకి వెళ్ళకూడదు.

ఇంత జరిగినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేవరకూ దీక్ష విరమించానన్న 'అన్నా' నిజంగా అభినందనీయుడు. మన రాజకీయ నేతల నిరాహార దీక్షలు ఎన్ని చూడలేదు!!

అంకురం           ఒక పుట్టుక
                    ఓ కొత్త చిగురు
                    ఒక పులకింత
                    ఒక ప్రక్రుతి వింత 

ఈ అంకురం       ఒక ఉత్తేజం
                    ఒక చైతన్యం
                    ఒక యువ తరంగం
                    ఒక ఉద్యమం 
                    ఒక హెచ్చరిక 

అవినీతి పూసుకున్న నేతలారా... 
మాటలు ఆపండి... చేతలు చూపండి.
ఈ దేశం లో కూడా ...
ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు !!
మీ మెడలు వంచగలరు !!

జయహో భారత్ ప్రజ,  జైహింద్.

మల్లాది లక్ష్మణ కుమార్.