4, ఏప్రిల్ 2010, ఆదివారం

పొలిమేర దాటేల్లిపోయింది

నేను క్రితం రాసిన "ఆ రోజుల్లో..." కి కొనసాగింపుగా ......

ఈ మధ్య వంశి (సిన్మా వంశి) మహాద్భుతం గా రాసి చూపించిన (కళ్ళకు కట్టినట్టుగా) "మా పసలపూడి కథలు" చదివారా! అక్కడక్కడ శృంగార మరకలు కనిపించినా, చాలా కథలలో మనసును కరిగించునట్టి, కదిలించే ఇతివృత్తాలు తో వంశి చాలా గొప్ప సృష్టి చేసాడు. దానిలో ఒక కధలో చెప్తాడు (పొలిమేర దాటేల్లిపోయింది.. పుస్తకం లో చిట్టచివరి కథ)

"కాలవగట్టు దగ్గరాగిన బస్సులోంచి దిగిన చిన శంకరం ట్రంకు పెట్టి పట్టుకుని దిగువలో ఉన్న ఊళ్ళోకి నడక మొదలెట్టాడు.
రధం ముగ్గులు, మల్లెపందిరి ముగ్గులు, ఏనుగు పాదం ముగ్గులు ఒకటేంటి రకరకాల ముగ్గులు ఒంచిన నడుం ఎత్తకండా నడవడానికి పిసరంత సందు లేకండా ముగ్గులేసేస్తున్నారు ఆడపిల్లలు.   చిన్నచిన్న సందులన్ని కల తిరిగిన హరిదాసు బ్రహ్మయ్యగారి వీధిలో కొచ్చేసరికి చిన్న పిల్లలంతా కల్సి దండకట్టేసారు. రెడ్ల ఇళ్ళకి పెరుగులకి పాలకి వెళ్తున్న చిన్న కులాల పిల్లలు గోపాలస్వామి గుడి గోడ పక్కన రాలిన పారిజాతం పూలు ఎరుకుంటున్నారు ....
అవుపెడతో అలికి ముగ్గులు పెట్టిన అరుగులు, పసుపు రాసి బొట్లేట్టిన గడపలు మామిడాకుల తోరణాలు కట్టిన ద్వార బంధాలు, సంప్రదాయంతో కళకళలాడుతుంది వూరు.  కళ్ళు కడుక్కోడానికి పాలేరుతో ఇత్తడి గంగాలంచెంబు పెట్టించింది వాళ్ళ చిన్నక్క. చిలక్కోయ్యకి తగిలించున్న గల్ల తువ్వాఅలందించాడు బావ.....
గోర్మిట్టీలు, బెల్లంపూతరేకులు, పాలపూరీలు, పాకుండలు రకరకాల పిండి వంటలు, దబ్బకాయ పులిహార,ఆవపెట్టిన అరిటి పువ్వు కూర, పనస పొట్టు కూర , కంది పచ్చడి , అత్తగారలా కూరేస్తుంటే ఎక్కిసం అయిపోయినా మొత్తానికెలాగో లాగించి పందిరిపట్టి మంచం ఎక్కి పడుకున్న మనిషి తిరిగి లేచేసరికి చీకటై పోయింది ....
వెడల్పాటి ఆ గోదావరి కాలవలో గూటి పదవ నెమ్మదిగా వెళ్తుంటే కాలవకి ఎడాపెడా పచ్చటి వేప చెట్లు, మామిడిచెట్లు, గానుగ చెట్లు , నిద్రగన్నేరు చెట్లు, ఏ పక్కకి చూసినా పచ్చదనం.  దూరంగా ఎక్కడో పొలాల్లో తాటాకు గుడిసలు వాటి కొప్పుల్లోంచి వస్తున్న పొగ, గులగుర్త  రేవు దగ్గర కొత్త బట్టలు కట్టుకున్న నలుగురు ఆడపిల్లలు మొన్నే వండిన కొత్త బెల్లంతో చేసిన పరమాన్నం, బూరలు, ఇత్తడి గిన్నెల్లో పెట్టుకుని వాటి మీద అరిటాకు ముక్కలు కప్పుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తున్నారు.

అందమైన అనాటి జీవితాన్ని అందమైన కాలవ కింద పల్లెటూళ్ళ ని  వాటి మధ్యలో మరీ అందమైన పసలపూడి గ్రామాన్ని చెక్కుచెదరని సంప్రదాయాల్ని, కట్టుబాట్లని, వాళ్ళ అమాయకత్వాన్ని మానవ  సంబంధాల్నీ నెమరేసుకుంటూ చాలా ఏళ్ళ తర్వాత ఊళ్ళోకి దిగాను.
"చుదీదార్లూ మిడీలు వేసుకున్న ఇద్దరు పిల్లలు కేనతిక్ హోండా వెనకాలేక్కి మాముందు నిన్చేల్లేరు. గోపాలస్వామి గుళ్ళో పూజారిగారి కోడలు నైటీ వేసుకుని నారింజకాయల సైకిలోడితో బెరమాడుతూ ఈలోగా తేగల కట్ల  తట్ట మనిషేల్తుంటే తానని పిలుస్తోంది స్టైలుగా....
ఊళ్ళో ఏ పక్కకు  చూసినా కేనేతిక్ హొండలు, స్పెండర్లు కనపడ్తున్నాయి.నడుస్తున్న మా పక్కనించి ఒక ఇండికాకారు స్పీడుగా వెళ్ళిపోతే క్వాలిస్ దానికి ఎదురొచ్చింది.  సంతపేట లో ఒకప్పుడు ధాన్యం మిల్లున్దేచోటు ఇప్పుడు ఖాళీగా ఎత్తుగా పచ్చగడ్డి మొలిచి వుంది. మాసిన పంజాబీ  డ్రేస్స్ వేసుకున్న ఒక పిల్ల రెండు గేదెల్ని అక్కడ మేపుతావుంది.  గొల్లలతూము దగ్గర ఎవరో పాతిల్లు పడగొట్టి మోడరన్ బిల్డింగ్ కట్టుకున్నారు. ఆవేళ గృహప్రవేశం అనుకుంటాను, వరసగా టేబుళ్లు వేసి వున్నాయి. కూర్చుని భోంచేస్తున్న జనాల ముందుకి అన్నం గిన్నెతో వచ్చిన కుర్రాడు "కొంచెం వైట్ రైస్ వడ్డిన్చమంటారా?" అంటున్నాడు.
ఇవ్వేళ రాజేశ్వరస్వామి తీర్థం గుర్తుందా? అన్నాడు త్యాగరాజు.
రధం లాగుతూ ఉంటారీపాటికి  పదండి అనేసి కదిలాను.
దారు శిల్పాలతో నిన్దిపొయిఉన్న మా రాజేశ్వరస్వామి  రధానికి ముందు ఎడాపెడా నాలుగు అంగుళాల కైవారంతో పొడుగ్గా ఉండే ఆ రెండు పెద్దాపురం తాళ్లనీ చెరి వందేసి మందీ లాగేవారు వెనకటికి.  లాగడానికి సంబరపడే చాలా మంది కుర్రోళ్ళు తాడు లేక మిగిలిపోయేవారు. అల్లాంటిది...
ఇవ్వేళ మా దేవుడి రధం రెండు తాల్లనీ వందలమంది జనాలు లాగడానికి బదులుగా,  ఎర్రరంగు మహేంద్ర ట్రాక్టర్ లాగుతుంది.

నేనెప్పుడూ ఏడవలేడుగానీ, ఆ దృశ్యం చూస్తున్నపుడు మట్టుకి నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు జలజలా రాలిపోయినియ్యి."




యెంత చక్కగా పిందేసాడండీ గుండెల్ని.  ఈ కథలలో బాపుగారి బొమ్మలన్నీ సందర్భోచితంగా ఉన్నాయి , అసలు కధ చదువుతుంటే ఆ బొమ్మ చూస్తుంటే సారాంశం అంతా  మన కళ్ళకు కట్టేస్తుంది. అంత గొప్ప అవిడియాలు ఎలా తడతాయో ఆయనకి?  మీరు మట్టుకు ఈ పుస్తాకాన్ని  వదలకుండా చదవండి.  కనీసం తెలుగు బతుకు బతక లేక  పోయినా అచ్చ తెలుగు గ్రామాలు, సంబంధాలు, ప్రకృతి ఎలా వుంటుందో చదివి ఆనందించండి.
ఆయ్... మరిక దిగాడతానండి
మీ
మల్లాది లక్ష్మణ కుమార్

ఆ రోజులే వేరు!!

ఆ రోజులే వేరు!!
మనం ఎప్పుడు వాడే మాట ఇది. ఒక ఉరు నుంచి వేరొక వూరు వెళ్ళినా, ఉద్యోగం మారినా, లేదా మన వయస్సు మారినా, పాత సంగతులు గుర్తుకొచ్చినపుడు మనం అంటుంటాం, "అబ్బ నువ్వేన్నైన చెప్పరా కానీ,  ఆ రోజులే వేరు".
దానికి నేనేమీ మినహాయింపు కాదు. చిన్నతనం లో మనం చేసిన అల్లరి, బాధ్యతలు లేని జీవితం ఎవరికి బాగుండదు చెప్పండి. వేసవి కాలం సెలవలు వచ్చిందంటే సూర్య కిరణాలు లేపుతుంటే లేవటం, (అంటే ఆలస్యం గా) ఎడ పెడా తిరిగేయ్యటం, సాయంత్రం పక్కింటి అబ్బాయి బుడ్డిబాబు, రాము, మా అన్నయ్య వాళ్ళతో గోలికాయలు ఆడటం, పోద్దస్తమాను రేడియో వినటం, ఇన్ని వ్యాపకాలు ఒక్కసారిగా మీద పడి పోతాయి. ఎండలు మండేవి అనుకోండి, కాని ఆయనెవరో చెప్పినట్టు, "మావిడి పళ్ళు, మల్లె పువ్వులు కావాలి గాని, మండుటెండలు అక్కరలేదా అని" ... ఆ రోజులే వేరు.
ఉదయం రేడియో లో మల్లిక్ గారి రాజ రాజేశ్వరి స్తోత్రం తో సుప్రభాతం అవటం మనం ఈ రోజుల్లో ఊహిన్చలెము .  మల్లాది సూరిబాబు గారి లింగాష్టకం, బాల మురళి రామదాసు కీర్తనలు, మధురాష్టకం, సుప్రభాతం, దేవి స్తుతి, సత్యదేవుని పాటలు, ఇలా చెప్పుకుంటూ పొతే మనం ఈ రోజుల్లో చాలా కోల్పోతున్నాం అనిపిస్తుంది. ముఖ్యం గా వాయులీనపు నేపద్యం లో మల్లిక్ గారి మంద్ర స్వరం లో ఆ స్తోత్రం పోద్దుపోద్దున్నే మనసుని ప్రశాంతం గా చేసేది. (ఇది ముఖ్యం గా విజయవాడ స్టేషన్ వినేవాల్లకే).
ఇప్పుడు కూడా ఆ పాత మధురాల్ని ఆలిండియ రేడియో వాళ్ళు తమ archieves దుకాణం లో అమ్మకానికి పెట్టారట. వీలయితే కొనుక్కుని, ఆ మధురాల్ని అచ్చంగా ఉన్చేసుకోండి.  నా మటుకు నాకు నా బాల్యం అంటే గత స్మృతులన్నీ సున్నాలు చుట్టుకుంటూ ఆ నేపధ్య సంగీతం తో కనివినిపిస్తాయి. ఇక శ్రావణ  మాసం లో (మా) బందరు, వర్షం లో పొద్దస్తమానం స్నానం చేస్తూనే ఉండేది. చల్లటి ఆ వాతావరణం, బురద బురద (కొండొకచో నీరు నిండిన) రహదారులు, ఆ వర్షం లో తడుస్తూ ఊరంతా తిరగడం, పేరంటాళ్ళు, పట్టు చీరల రెపరెపలు, తాంబూలాలు, శనగలు  సెనగల మసాల గారెలు,  ఇంకా ఇంకా చాలా ... నాకు నచ్చిన నా పాత జ్ఞాపకాలు.